న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతమవుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనమవుతున్నాయి. కేసులు ఇలాగే పెరిగిపోతే క్రూడాయిల్కు డిమాండ్ తగ్గిపోతుందున్న ఆందోళనల నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచంలో ముడి చమురు దిగుమతులతో ఇండియాది మూడోస్థానం. దీంతో ఇండియాలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆయిల్కు డిమాండ్ తగ్గిపోతోంది.
మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా.. బుధవారం మరో 48 సెంట్లు పతనమైంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 66.09 డాలర్లుగా ఉంది. అతి పెద్ద ముడిచమురు వినియోగదారుల్లో ఇండియా కూడా ఒకటని, ఇక్కడ కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఆయిల్ డిమాండ్ను తగ్గిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర రావ్ అన్నారు.
ఇప్పటికే ఓపెక్, దాని మిత్ర దేశాలు ఆయిల్ ఉత్పత్తిని భారీగా పెంచాయని, రానున్న రోజుల్లో అందుకు తగినట్లు డిమాండ్ ఏర్పడకపోతే ధరలు మరింత పతనమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించారు. దీని ప్రభావం ముడి చమురు వినియోగంపైనా పడింది. డిమాండ్ తగ్గడంతో రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించాయి.