హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు. బే ఆఫ్ బెంగాల్లో సంభవించిన సైక్లోన్ యాస్, అరేబియా సముద్రంలో సంభవించిన సైక్లోన్ తౌక్టే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళను తాకుతాయని తాము ఊహించినట్లు తెలిపారు. కాగా అది ఇప్పుడూ జూన్ 3 ప్రాంతంలో మాత్రమే కేరళను తాకనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జూన్ రెండవ వారంలో మాత్రమే రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్న తెలిపారు.
రుతుపవనాల గాలులను ఈ రెండు బలమైన తుఫానులు బలహీనపరిచాయన్నారు. నివేదికల ప్రకారం కేరళ సమీపంలో గాలులు ఇప్పటికీ ఉత్తర దిశగా వీస్తున్నట్లు వాస్తవానికి అక్కడ అవి నైరుతి దిశలో ఉండాలన్నారు. ఇది రాష్ట్రంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనేదానిపై నాగరత్నం మాట్లాడుతూ.. జూన్ నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ తేలికపాటి వర్షాలే ఉంటాయని జులైలో ఇవి పుంజుకోనున్నట్లు చెప్పారు.