భోపాల్ : కరోనాకు మందు ఆత్మస్థైర్యం, పాజిటివ్ ఆలోచనలే అని వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం విదితమే. పాజిటివ్గా ఆలోచించి, ధైర్యంతో ఉంటే కరోనాను జయించొచ్చు అని ఓ 104 ఏండ్ల వృద్ధుడు అంటున్నాడు. తనకు కరోనా సోకినప్పటికీ పాజిటివ్గా ఆలోచించానని, చిరునవ్వుతో ఉన్నానని, సరిపడ పోషకాహారం తీసుకుని కరోనాను జయించాను అని ఆ వృద్ధుడు చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్లోని బేతుల్కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు భ్రుదిచంద్ జీ గోతి(104) ఏప్రిల్ 5న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో తమ ఫ్యామిలీ డాక్టర్ సూచనల మేరకు ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకున్నాడు. రోజులో 2 నుంచి 3 గంటల పాటు ఆక్సిజన్ను తీసుకున్నట్లు తెలిపాడు. దీనికి తోడు పాజిటివ్గా ఉండటం, నవ్వుతూ ఉండటం, రోజు వ్యాయామం చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పోషకాహారం తీసుకున్నట్లు తెలిపాడు. కరోనా సోకిన వారందరూ కూడా పాజిటివ్గా ఆలోచించాలని, నెగిటివ్కు దూరంగా ఉండాలని ఆ వృద్ధుడు సూచించాడు.
మధ్యప్రదేశ్లో శనివారం ఒక్కరోజే కొత్తగా 12,918 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 104 మంది మరణించినట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు వెల్లడించారు. ఆ రాష్ర్టంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,85,703కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,041కి చేరింది. దేశంలో ఆదివారం ఉదయం నాటికి 3,49,691 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 2,767 మంది చనిపోయారు.