దుబాయ్: మే నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్( ICC Men’s Player of the Month ) అవార్డుకు నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పురుషులు, మహిళా క్రికెటర్లకు ప్రతినెలా ఐసీసీ అవార్డులు అందజేస్తున్నది. మెన్స్ క్రికెట్లో హసన్ అలీ(పాకిస్థాన్), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)లను నామినేట్ చేసింది.
మహిళల క్రికెట్లో క్యాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్)లను నామినేట్ చేసింది.మే నెలలో జింబాబ్వేతో రెండు టెస్టులు ఆడిన పాక్ బౌలర్ హసన్ అలీ 14 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక అరంగేట్ర బౌలర్ ప్రవీణ్ బంగ్లాదేశ్తో ఒక టెస్టులో ఆడి 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ శ్రీలంకతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాడు. శ్రీలంకపై తొలిసారి బంగ్లా వన్డే సిరీస్ గెలువడంలో రహీమ్ కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో 125 పరుగులతో ఆకట్టుకున్నాడు.