న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలోని పలు రాష్ర్టాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిమాండ్కు తగ్గట్టు ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తిని పెంచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం వినూత్న పద్ధతులను పాటించాలన్నారు. ఆక్సిజన్ అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు సూచించారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే స్థానిక అధికారులను బాధ్యులుగా చేయాలని ఆదేశించారు. పలు రాష్ర్టాల్లో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రాణవాయువు ఉత్పత్తిని పెంచే విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ర్టాలకు ఆక్సిజన్ సరఫరా గణనీయంగా పెరుగుతున్నట్టు ప్రధాని తెలిపారు.
ప్రైవేట్, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థల సహకారంతో గత కొద్దిరోజులుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ లభ్యత రోజుకు 3,300 మెట్రిక్ టన్నుల మేర పెరిగినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం 20 రాష్ర్టాల్లో రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ డిమాండ్ ఉన్నదని, బుధవారం నుంచి కేంద్రం ఆయా రాష్ర్టాలకు 6,822 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నదని వివరించింది. గమ్యస్థానాలకు ఆక్సిజన్ను తరలించిన అనంతరం ఖాళీ ట్యాంకర్లను హెలికాప్టర్ల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థలకు వేగంగా చేరుస్తున్నట్టు వివరించింది. దవాఖానల్లోనే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివిధ శాఖల అధికారులు ప్రధానికి తెలిపారు.
ఆక్సిజన్ ట్యాంకర్లు ఆగొద్దు!
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, తమ రాష్ట్ర సరిహద్దుల గుండా రవాణాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. తమ ఆదేశాల ఉల్లంఘన జరిగితే సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీని బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. కొన్ని రాష్ర్టాలు ఇతర రాష్ర్టాలకు వెళుతున్న ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ ఆదేశాలను జారీ చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్లను అన్ని వేళల్లోనూ నగరాల్లోకి అనుమతించాలని పేర్కొంది. ఆక్సిజన్ తయారీదారులపై వారు ఉన్న రాష్ట్రంలోని దవాఖానలకే సరఫరా చేసేలా ఆంక్షలు విధించరాదని స్పష్టం చేసింది. పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా చేయడాన్ని కేంద్రం నిషేధించిందని తెలిపింది.
ఇవీ కూడా చదవండి…
ఇండియాకు సాయం చేయడానికి సిద్ధం: చైనా
మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా
కోళ్లు గుడ్లు పెట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు