న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియనందున ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరువాలా వద్దా అన్నది రాష్ట్రాలే డిసైడ్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. అయితే పిల్లలు వ్యాప్తి కారకులుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉపాధ్యాయులను ప్రయార్టీ గ్రూప్ కిందకు చేర్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయడం రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది పెద్దల్లో ఇప్పటి వరకు కేవలం పది శాతం మంది మాత్రమే కరోనా టీకా పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు స్కూళ్ల టీచర్ల టీకా శాతం, పరిస్థితిపై సీబీఎస్ఈ, యూజీపీతోపాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది.