ముంబై, జూలై 5: గిరిజన హక్కుల నేత, ‘ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసు’లో నిందితుడు స్టాన్ స్వామి (84) సోమవారం మధ్యాహ్నం మరణించారు. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన దాని కోసం ఎదురుచూస్తూనే కన్నుమూశారు. ఆయన బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరుపాలంటూ స్వామి న్యాయవాది మిహిర్ దేశాయ్ సోమవారం ఉదయం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభించేలోపే స్వామి మృతిచెందారు. ఆయన తాజా మెడికల్ రిపోర్టులు అందజేయాలని కోర్టు కోరగా… ఎన్ఐఏ జోక్యం చేసుకుంటూ అత్యవసర విచారణను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. అ సమయంలో దేశాయ్ కల్పించుకుని స్వామి చికిత్స పొందుతున్న హోలీ ఫ్యామిలీ దవాఖాన డైరెక్ట్ డాక్టర్ డిసౌజా ఒక నిమిషం మాట్లాడుతారని కోర్టును అభ్యర్థించారు. స్వామి మరణవార్తను డిసౌజా కోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోమన్ క్యాథలిక్ సంస్థ జేసూట్కు చెందిన మతాచార్యుడు అయిన ఫాదర్ స్వామి భౌతికకాయాన్ని ఆయన సహచరుడు ఫాదర్ ఫ్రేజర్ మస్కరెన్హాస్కు అప్పగించాలని, అంత్యక్రియలను ముంబైలోనే నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది.
మే 29న దవాఖానకు
కొవిడ్-19, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న స్వామిని హైకోర్టు ఆదేశాలపై మే 29న తలోజా జైలు నుంచి దవాఖానకు తరలించారు. మొదట ప్రభుత్వ దవాఖానకు, కొద్దిరోజుల కిందట అక్కడ నుంచి హోలీ ఫ్యామిలీ దవాఖానకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చిందని, అనంతరం ఆయనకు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందించామని కోర్టుకు దవాఖాన డైరెక్టర్ డిసౌజా తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, పార్కిన్సన్ వ్యాధితో పాటు కొవిడ్-19 అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలతో స్వామి మరణించారని పేర్కొన్నారు. స్వామికి సకాలంలో వైద్య సహాయం అందించడంలో ఎన్ఐఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది దేశాయ్ కోర్టులో ఆరోపించారు. స్వామిని ఎన్ఐఏ గత అక్టోబర్లో అరెస్టు చేయగా అప్పటి నుంచి జైలులో ఉన్నారు. ఆయన పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. స్వామి మృతిని కస్టడీలో హత్యగా పరిగణించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వామి మృతికి ప్రభుత్వమే కారణమని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ ఆరోపించారు.