భోపాల్: మధ్యప్రదేశ్లోని ఒక కరోనా టీకా కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. చింద్వారా జిల్లాలోని లోధిఖేడలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా టీకా కేంద్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. కొందరు పరుగెత్తగా ముందున్న కొందరు కిందపడ్డారు. తోపులాటలో మరికొందరు వారిపై పడ్డారు. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిలో చాలా మంది మాస్కులు ధరించలేదు. కాగా, టీకా కేంద్రం వద్ద తొక్కిసలాట పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. మరోవైపు దీనికి సంబంధించి 48 సెకండ్ల నిడివి ఉన్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కాగా, మధ్యప్రదేశలో గురువారం 9.5 లక్షల డోసుల టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలోని 3 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకా పొందారని అధికారులు వెల్లడించారు.