చెన్నై: తమిళనాడులో పెట్రోల్ ధర లీటరుకు రూ.3 మేర తగ్గించారు. డీఎంకే ప్రభుత్వం ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. సీఎం స్టాలిన్ సర్కార్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘తమిళనాడులో 2.6 కోట్ల మంది ప్రజలు ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. వారిపై భారంపడకుండా పెట్రోల్ ధరలో రూ.3 తగ్గించాం. దీని కారణంగా రూ.1,160 కోట్ల లోటును ఎదుర్కొంటాం’ అని చెప్పారు. వాతావరణ మార్పు రంగంపై బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా సభ్యులకు నెలవారీగా రూ.1,000 ఇస్తామన్న స్టాలిన్ ఎన్నికల వాగ్దానం కూడా ఈ బడ్జెట్లో పరిగణనలోకి తీసుకున్నారు.
తమిళనాడులోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు కాలం 9 నెలల నుంచి 12 నెలలకు పొడిగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రూ.703 కోట్లు సబ్సిడీగా మంజూరు చేశారు. ఈ ఆర్థిక ఏడాది నుంచి సీఎం బీమా పథకాన్ని రూ.1,046 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.3,800 కోట్లు, ఎంజీఆర్ మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,725 కోట్లు కేటాయించారు. చెన్నైని పోస్టర్ రహిత నగరంగా చేస్తామని, మూడు కొత్త ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ 2025 నాటికి పూర్తవుతుందని వెల్లడించింది.
కాగా, తమిళనాడు చరిత్రలో తొలిసారి స్టాలిన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ను కాగిత రహితంగా ప్రవేశపెట్టింది. దీని కోసం సభ్యులందరి టేబుల్స్ వద్ద కంప్యూటర్లు ఏర్పాటు చేసింది.