అయినా లక్షణాలుంటే జాగ్రత్త
వైద్య నిపుణులు సూచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్) చేయించుకున్నారు. మిత్రుడి సలహా మేరకు మరోచోటకు వెళ్లి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ర్యాట్లో పాజిటివ్ రాగా, ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక వైద్యుల వద్దకు పరుగుపెట్టారు. ఇలాంటి ఉదాహరణలు సెకండ్ వేవ్లో చాలా ఎదురవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. నిజానికి లక్షణాలు లేనివారికి ర్యాట్ చేయిస్తే నెగెటివ్ వస్తుంది. ఇలాంటి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ర్యాట్లో పాజిటివ్ వస్తే కొందరికి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వస్తున్నది. ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని నిర్దిష్ట లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పితోపాటు ఎక్కువ మందిలో డయేరియా వస్తున్నదని, ఇలాంటి లక్షణాలు గుర్తించాలని చెప్తున్నారు. పాజిటివ్ లేదా నెగెటివ్ రిపోర్టుతో సంబంధం లేకుండా, బాధితులు జాగ్రత్త పడాలని, లక్షణాలుంటే వెంటనే వేరుగా ఉండటం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆక్సిజన్ లెవల్ తగ్గితే..
జ్వరం, దగ్గు, జలుబుకుతోడు ఏ ఇతర లక్షణాలున్నా కరోనా అనుకొని జాగ్రత్త పడాలి. ఏ లక్షణం ఉంటే దానికి మందులు వాడాలి. శ్వాస సమస్యలు ఎదురైతే వెంటనే అప్రమత్తం కావాలి. ఆక్సిజన్ లెవల్ 93 కంటే తక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి. మార్కెట్లో నాణ్యతలేని కొన్ని యాంటిజన్ టెస్టు కిట్ల వల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. తొలుత నెగెటివ్, ఆ వెంటనే పాజిటివ్ రావడం అనేది సెకండ్ వేవ్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతున్నదో అధ్యయనాలు కొనసాగుతున్నాయి.