ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ 1953 మార్చి 1న జన్మించారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి-దయాళు అమ్మాల్ దంపతుల మూడో సంతానం ఆయన. 14 ఏండ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడే తన మామ మురసోలి మారన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే పార్టీ జనరల్ కమిటీలో స్థానం దక్కించుకొన్నారు. 1976లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పి మీసా చట్టం కింద జైలు పాలయ్యారు. దీంతో స్టాలిన్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన డీఎంకేలో క్రమంగా ఎదిగారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2017 వరకు (దాదాపు 40 ఏండ్లు) ఈ పదవిలో ఉన్నారు. పార్టీలో పదవుల కోసం ఎన్నడూ తొందరపడలేదు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. ఓపిగ్గా ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. స్టాలిన్ రాజకీయ జీవితంలో 2010 ఓ కీలక మలుపు. అప్పటిదాకా తన పిల్లలు ముగ్గురిని (అళగిరి, కనిమొళి, స్టాలిన్లను) రాజకీయాల్లో సమానంగా ప్రోత్సహించిన కరుణానిధి.. తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టే వారి విషయంలో మాత్రం స్టాలిన్ వైపు మొగ్గారు. దీనిపై అళగిరి అసంతృప్తి వ్యక్తంచేశారు. స్టాలిన్, అళగిరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అళగిరికి కోపిష్టి అన్న పేరు ఉంది. స్టాలిన్కు పార్టీ క్యాడర్పై పట్టు ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా అళగిరిని డీఎంకే నుంచి కరుణానిధి సస్పెండ్ చేశారు. ఫలితంగా స్టాలిన్ పార్టీపై పూర్తి పట్టు సాధించారు. పార్టీ అధ్యక్షుడయ్యారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకొన్నారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు విషయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీని విజయతీరాలకు చేర్చారు.
చెన్నై, మే 2: తమిళనాడు రాజకీయాల్లో కొత్త సూర్యుడు ఉదయించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇద్దరు రాజకీయ ఉద్ధండులు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. దశాబ్దకాలంపాటు అధికారానికి దూరమైనప్పటికీ, కొత్త ఉత్సాహంతో, స్టాలిన్ వినూత్న వ్యూహాలతో ఎన్నికల సమరాంగణంలో దిగిన ఆ పార్టీకి తమిళ ప్రజలు విజయకేతనాన్ని అందించారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో 160 స్థానాల్లో (గెలుపు/ఆధిక్యం) డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్నది. డీఎంకే సొంతగా 136 సీట్లను (గెలుపు/ఆధిక్యం) కైవసం చేసుకునే అవకాశమున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 సీట్లు అవసరం. గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే.. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత సరైన దిశానిర్దేశం లేకుండా మారింది. దీని ప్రభావం ప్రస్తుత ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 74 స్థానాల్లో (గెలుపు/ఆధిక్యం) మాత్రమే ఆధిక్యంలో నిలిచింది. అన్నాడీఎంకే సొంతగా 65 స్థానాల్లో (గెలుపు/ఆధిక్యం) గెలుపొందవచ్చు. మరోవైపు, నటుడు కమల్హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదు. కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ ఓటమిపాయ్యారు. జయలలిత సన్నిహితురాలు, ఇటీవల రాజకీయాలకు గుడ్బై చెప్పిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నెట్ర కజగమ్ పార్టీ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. కోవిల్పట్టి స్థానం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు దినకరన్ పరాజయం పాలయ్యారు.
స్టాలిన్ 1984లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. చెన్నైలోని థౌజండ్లైట్స్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి కేఏ కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు. 1989లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. అక్కడ 6 సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 2011లో కొళత్తూరు నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా కొళత్తూరు నుంచే బరిలో దిగి విజయం సాధించారు.
స్టాలిన్ 1996లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెన్నై మేయర్ స్థానానికి పోటీచేసి గెలిచారు. ఇలా రెండు ఎన్నికైన పదవుల్లో ఏకకాలంలో పనిచేశారు. 2001లో కూడా చెన్నై మేయర్గా మళ్లీ గెలిచారు. అయితే 2002లో అప్పటి సీఎం జయలలిత.. ఒకే వ్యక్తి రెండు ఎన్నికైన పదవుల్లో ఉండకుండా చట్టం తీసుకొచ్చారు.
తండ్రి కరుణానిధి (సినీ రచయితగా) సినీరంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. స్టాలిన్కు కూడా ఆ రంగంలో ప్రవేశం ఉంది. పాతికేళ్ల వయస్సులోనే 1978లో నంబిక్కై నట్చత్రం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఒరేరత్తమ్, మక్కల్ అనయట్టల్ చిత్రాలతో పాటు కురుంజి మలార్, సూరియా టీవీ సిరీస్ల్లో నటించారు.
తమ కూటమిలోని కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలకు సీట్ల పంపిణీ విషయంలో కూడా స్టాలిన్ చాలా పట్టుదలతో వ్యవహరించడం కలిసొచ్చింది. డీఎంకే బలంగా ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు ఇవ్వడానికి స్టాలిన్ ససేమిరా అన్నారు. అలా మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే 173 సీట్లలో పోటీచేయగా.. మిగిలిన 61 సీట్లను 12 మిత్రపక్షాలకు వదిలేశారు. అదే స్టాలిన్కు గెలుపు అశ్వంగా మారింది.
మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారు. ప్రస్తుత సీఎం కే పళనిస్వామి, డిప్యూటీ సీఎం వో పన్నీర్సెల్వమ్ నేతృత్వంలో పార్టీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ద్వితీయ శ్రేణి క్యాడర్లో అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైపోయింది. 2018లో కరుణానిధి మరణంతో మొత్తం పార్టీ బాధ్యతలను భుజానవేసుకున్న ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ అధికార పక్షం బలహీనతలను తొందరగానే పసిగట్టారు. గెలుపు కోసం అప్పటి నుంచే వ్యూహ రచనను పకడ్బందీగా అమలు చేశారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యారు. అధికార కూటమి వైఫల్యాలను, తాము చేయబోయే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, అన్నాడీఎంకే పార్టీలో రేగుతున్న అంతర్గత పోరును ఓట్లుగా మలుచుకోవడంలోనూ సఫలమయ్యారు.
చెన్నై: రసవత్తరంగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఎంఎన్ఎం.. శరత్కుమార్ పార్టీ ‘ఆలిండియా సమతువ మక్కల్ కట్చి’తో పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేశాయి. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ ఓటమిని చవిచూశారు. మిగతా స్థానాల్లో కూడా కమల్ కూటమి ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
తమిళనాడు
మొత్తం సీట్లు 234
డీఎంకే కూటమి 160
ఏఐఏడీఎంకే కూటమి 74