నల్లగొండ : సొంత స్థలం ఉన్న ప్రతి పేదకు రెండు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇండ్ల నిర్మాణాలకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా బడ్జెట్ లో రూ. 11 వేల కోట్లు వెచ్చించారని ఆయన వెల్లడించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలం ఊరబాయి తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు ఏండ్ల పాలనకు గాను ఇక్కడి నుంచి నోముల నరసింహ్మయ్యను నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారన్నారు. దురదృష్టవశాత్తు నోముల మరణంతో ఈ ఉప ఎన్నికలు సంభవించాయని ఆయన తెలిపారు.
ఆయన వదిలి పెట్టిన సంక్షేమాన్ని అభివృద్ధి ని ముందుకు తీసుకపోవడానికే ఆయన తనయుడు యువకుడు, విద్యావంతుడు నోముల భగత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి మీ ముందుకు పంపించారని ఆయన చెప్పారు.
అటువంటి అభ్యర్థిని మీరు ఆశీర్వదించి పంపిస్తే నియోజకవర్గ అభివృద్ధి సులభమవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో తండాలను గాలికి వదిలేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం తండాలకు గుర్తింపు వచ్చిందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు నిధులు, విధులు ఇచ్చిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.
రాష్ట్రాన్ని 60 ఏండ్లు పాలిస్తే 35 ఏండ్లు ఇక్కడ జానారెడ్డి పాలించారని, అయినా ఆయనతో నియోజకవర్గానికి ఒరిగింది ఏమి లేదన్నారు. వరుసగా ఏడూ సార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆయన హయాంలో సమస్యలు పరిష్కారమే జరిగితే హాలియలో డిగ్రీ కాలేజీ ఎందుకు నెలకొల్ప లేకపోయారో ప్రజలకు జానారెడ్డి సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చాక పెరిగిన గ్యాస్ బండ ల ధరలను చూసి సామాన్యులు కుదేలు అవుతున్నారన్నారు. దండుగగా మారిన వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తుంటే అందుకు కేంద్రం మోకాలొడ్డుతుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ గెలుపుతోనే సాగర్ అభివృద్ధి సాధ్యమన్నారు.
ఇదిలా ఉండగా తండా కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా అహ్వానించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, సీనియర్ టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు