న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాలు ఈనెలలోనే ఇండియాకు రానున్నాయి. మరో పది రోజుల్లో స్పుత్నిక్ వీ టీకాలు రానున్నట్లు భారతీయ అంబాసిడర్ బాలా వెంకటేశ్ వర్మ తెలిపారు. అయితే స్పుత్నిక్ టీకాల ఉత్పత్తి ఇండియాలో మే నెలలో ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి నెలా 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తారని వెంకటేశ్ తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. స్పుత్నిక్ వీ టీకా వినియోగం కోసం అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్లో ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను వాడుతున్నారు. స్పుత్నిక్ టీకాకు ఆమోదం తెలిపిన 60వ దేశంగా భారత్ నిలిచింది. స్పుత్నిక్ కోసం ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకున్నది. స్పుత్నిక్ వీ.. ఇండియా-రష్యా వ్యాక్సిన్గా మారుతుందని, ఎందుకంటే భారత్లోనే ఆ టీకాల ఉత్పత్తి అధిక స్థాయిలో ఉంటుందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు. భారత్లో తమ వ్యాక్సిన్లను అయిదు ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పానేసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చోవ్ బయోటెక్లు ప్రతి ఏడాది 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నాయి.
స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యం కూడా పెరిగింది. తమ టీకా 97.6 శాతం పనిచేస్తున్నట్లు గమేలియా రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా పేర్కొన్నది. ఇప్పటి వరకు సుమారు నాలుగు కోట్ల మందికి స్పుత్నిక్ టీకా ఇచ్చారు. దాంట్లో కేవలం 0.027 శాతం మంది పాజిటివ్గా వచ్చినట్లు గమేలియా సంస్థ వెల్లడించింది. ఇటీవల లాన్సెట్ జర్నల్ తన నివేదికలో స్పుత్నిక్ టీకా సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.