ముంబై: మహారాష్ట్ర పూణేలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం సమావేశం జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ ఛత్రపాల్, రాష్ట్ర మంత్రి అదితి ఎస్ తత్కరే ఇందులో పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనుల పురోగతిపై సమీక్షించారు. అయితే వారి వాహనాలను స్పోర్ట్స్ ట్రాక్పై నిలుపడాన్ని పూణేకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ శిరోల్ తప్పుపట్టారు. కోట్ల విలువైన అథ్లెటిక్ ట్రాక్ను నాశనం చేయడమేగాక మన దేశానికి కీర్తి తెచ్చే క్రీడాకారుల స్ఫూర్తిని ఎంవీఏ ప్రభుత్వ నేతలు దెబ్బతీయడం సిగ్గుచేటు, అహంకార చర్య అని ట్విట్టర్లో విమర్శించారు. “మన దేశంలో తగినంత క్రీడా సౌకర్యాలు లేవు. అన్ని క్రీడా కేంద్రాలకు సరైన సంరక్షణ అవసరం” అని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు. కాగా, మహారాష్ట్ర క్రీడల శాఖ దీనిపై స్పందించి క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలా జరుగకుండా క్రీడా మంత్రి ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది.