పాట్నా: కరోనా టీకాలు రవాణా చేసే ప్రత్యేక వాహనం ఒకటి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొందరు స్థానికులు దీని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సరఫరా చేసే ప్రత్యేక వాహనం రోడ్డుపై ఆగిపోయింది. దీంతో దీనిని తోసి స్టార్ట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారు.
కాగా, ఈ వ్యాన్లో 89,689 కోవిషీల్డ్ వైల్స్ రవాణా చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ ముఖేష్ కుమార్ తెలిపారు. ప్రతి సీసాలో 10 డోసుల కరోనా వ్యాక్సిన్ ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో కరోనా టీకాల కొరత నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.