2020-21లో 72.35 శాతం నమోదు
69.87 శాతంతో రెండోస్థానంలో ‘సింగరేణి’
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తోముందంజలో ఉన్నాయి. 2020-21లో దేశవ్యాప్త పీఎల్ఎఫ్ను పరిశీలిస్తే తెలంగాణలోని థర్మల్ విదుత్తు కేంద్రాలు మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. టీఎస్జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు 72.35శాతంతో మొదటిస్థానంలో, సింగరేణి సంస్థ 69.87 శాతంతో రెండోస్థానంలో ఉన్నాయి. ఆల్ఇండియా థర్మల్ విద్యుత్తు కేంద్రాల సగటు 53 శాతం పీఎల్ఎఫ్గా నమోదయింది. రాష్ర్టాల సెక్టార్లో సగటు 45 శాతంగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్లో పీఎల్ఎఫ్ 22.09 శాతం ఉండగా.. ఛత్తీస్గఢ్లో 68.90 శాతంగా ఉన్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) పీఎల్ఎఫ్ 65 శాతం.
తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పీఎల్ఎఫ్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంపై జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ (సోలార్) ఉన్నప్పటికీ.. ఒకపక్క వాటిని ప్రోత్సహిస్తూనే తెలంగాణ థర్మల్ విద్యుత్తు కేంద్రాలు అత్యధిక పీఎల్ఎఫ్ సాధించడం గమనార్హమని చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లనే ఇది సాధ్యమయిందని తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకం, జెన్కో ఉద్యోగులు, కార్మికుల కృషి దీనికి అదనపు బలమని పేర్కొన్నారు.