న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో మెడికల్ ఆక్సిజన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముంబైలోని కలంబోలీ, ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని బొయీసర్ రైల్వే స్టేషన్ల నుంచి రోడ్ ట్యాంకర్లను ఫ్లాట్ వ్యాగన్లపై ఎక్కించి విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారొకు సోమవారం తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ ట్యాంకర్లలో మెడికల్ ఆక్సిజన్ను లోడ్ చేశాక తిరిగి ప్రయాణమవుతాయి. రైళ్లలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాకు గల అవకాశాన్ని పరిశీలించాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇటీవల కేంద్రాన్ని కోరాయి.