భువనేశ్వర్: ఇండియాలో కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అయిదు కోట్ల మందికి టీకా వేశారు. ఒడిశా రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే త్వరలో ఆ రాష్ట్రంలో కోవిడ్ టీకాల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సుమారు నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా టీకాలకు డిమాండ్ పెరగడంతో.. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులైన సీరం, భారత్బయోటెక్ సంస్థ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒడిశా ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మహాపాత్ర ఈ నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాశారు. తమ వద్ద మార్చి 30వ తేదీ వరకు డ్రైవ్ నిర్వహించేందుకు కావాల్సిన టీకాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏప్రిల్ 2వ తేదీన తమ రాష్ట్రానికి కోవీషీల్డ్ టీకాలు వస్తాయని, అంటే నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. ఒకవేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా సాగాలంటే.. టీకాలను పంపించాలంటూ ఆయన కేంద్రాన్ని కోరారు.