ఢిల్లీ : కొవిడ్-19 తేలికపాటి వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఆదివారం కరోనా వైరస్కు సంబంధించిన సమస్యలపై మేదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్, ప్రొఫెసర్, ఎయిమ్స్ మెడిసిన్స్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ నవీత్ విగ్, డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీల్ కుమార్ కొవిడ్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా గులేరియా మాట్లాడుతూ.. కొవిడ్-19 ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే ప్రజల్లో భయం నెలకొంది. ఈ భయం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో ఇంజెక్షన్లు, రెమ్డెసివిర్ డ్రగ్, ఆక్సిజన్ సిలిండర్లను ముందస్తుగా నిల్వచేసుకోవడం ప్రారంభించారు. దీని కారణంగా సరఫరా కొరతను ఎదుర్కొంటున్నాం. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించబడుతున్నాయని పేర్కొన్నారు.
కొవిడ్-19 అనేది సాధారణ ఇన్ఫెక్షన్ అన్నారు. 85 నుండి 90 శాతం మందిలో జ్వరం, జలుబు, శరీర నొప్పి, దగ్గు వంటి సాధారణ లక్షణాలనే చూస్తున్నాం. ఇటువంటి లక్షణాలుంటే రెమ్డెసివిర్ లేదా ఇతర పెద్ద డ్రగ్స్ అవసరం లేదు. సాధారణ ఇన్ఫెక్షన్లకు తీసుకునే మందులనే తీసుకోవచ్చు. ఏడు నుండి పది రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటారు. అంతేకాని మీ ఇంట్లో రెమ్డెసివిర్ లేదా ఆక్సిజన్ ఉంచాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ తీవ్ర సంక్రమణకు 10 నుండి 15 శాతం మంది మాత్రమే గురవౌతున్నారు. వీరికి రెమ్డెసివిర్, ఆక్సిజన్ లేదా ప్లాస్మా వంటి అదనపు మందులు అవసరం అవుతాయి. ఐదు శాతం కంటే తక్కువ మంది రోగులకు వెంటిలేటర్ అవసరం ఉంటుందని ఆయన తెలిపారు.