న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆ పదవిలో కొనసాగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు, విధేయులకు పార్టీలో సముచిత స్ధానం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోయినా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు యువరక్తం, సీనియర్ల మేళవింపుతో పార్టీని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సోనియా, రాహుల్ గాంధీలకు సహకరించేలా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంపైనా కసరత్తు సాగుతోంది.
వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్, కుమారి సెల్జా, ముకుల్ వాస్నిక్, రమేష్ చెన్నితల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రియాంక గాంధీకి ఎలాంటి నూతన బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రియాంక ప్రస్తుతం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక రెండేండ్లుగా పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా అప్పటినుంచి పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలను కాంగ్రెస్ వాయిదా వేస్తూ వచ్చింది.