చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసిందని పార్టీ చీఫ్ సోనియా గాంధీ సన్నిహిత వర్గాలు శనివారం వెల్లడించాయి. పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరుకు చెక్ పెట్టే దిశగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పార్టీ కీలక నేతలు పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం రాజీ ఫార్ములాలో భాగంగా ఈ నియామకాలు ఓ కొలిక్కివచ్చాయి.
అంతకుముందు శనివారం ఉదయం సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖఢ్ను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరపగా, పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ సీఎం అమరీందర్ సింగ్తో సంప్రదింపులు జరిపారు. అనంతరం హరీష్ రావత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదయోగ్యమేనని సీఎం అమరీందర్ సింగ్ చెప్పారని తెలిపారు.
ఇక పీసీసీ చీఫ్గా సిద్ధూ నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలకు స్వస్తి పలికే దిశగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం గత కొద్దివారాలుగా కసరత్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే.