న్యూఢిల్లీ : భారత్లో సెకండ్ వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా భావిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఆందోళనకరమైన వేరియంట్గా పరిగణిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్ను కనుగొన్నారని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధిక మరణాల రేటు నమోదైన పెరూలో ఈ స్ట్రెయిన్ పుట్టుకొచ్చిందని బ్రిటన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పటి నుంచి డెల్ట్రా స్ట్రెయిన్ ఆందోళనకరమైన వేరియంట్గా భావిస్తుండగా ఇది అంతకంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. లాంబ్డా స్ట్రెయిన్ బ్రిటన్కూ వ్యాప్తి చెందిందని ఈ తరహా కేసులు ఆరు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే లాంబ్డా స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని పాన్ అమెరికన్ ఆరోగ్య సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు. పెరూలో మే, జూన్లో నమోదైన కేసుల్లో 82 శాతం లాంబ్డా స్ట్రెయిన్కు చెందినవేనని వారు వెల్లడించారు. లాంబ్డా వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా యాంటీబాడీల తటస్థీకరణను నిరోధిస్తుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.