ముంబై: కరోనా కష్టకాలంలో ఎంతో మంది బాధితులకు సాయం చేస్తూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆపద్బాంధవుడిలా మారాడు. ఆయన సాయం పొందిన ఎంతో మంది దేవుడిలా పూజిస్తున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పేరును వాడుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే కుట్రలకు తెరతీశారు. తాజాగా అలాంటిదే ఒక ఘటన వెలుగుచూసింది. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో కొందరు ఒక ఫోన్ పే నెంబర్ను సోషల్ మీడియాలో పెట్టి విరాళాలు కోరారు.
సోనూసూద్ ఫౌండేషన్కు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మొదలు మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఒక డిజైన్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. అందులో ఒక ఫోన్ పే నంబర్ కూడా ఇచ్చారు. అయితే.. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ నకిలీ పోస్టును షేర్ చేస్తూ వార్నింగ్ అని హెచ్చరించారు. అది ఫేక్ ఫౌండేషన్ అని, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.