సీబీడీటీ అభియోగం
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్, ఆయన సహచరులు రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది. మూడు రోజులపాటు సోనూసూద్ నివాసం, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సీబీడీటీ ఓ ప్రకటన విడుదల చేసింది. లెక్క చూపని ధనాన్ని బినామీల పేరిట సోనూసూద్ రుణాలు తీసుకున్నట్టు గుర్తించామని పేర్కొంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించాడని, ఛారిటీ ఫౌండేషన్కు వచ్చిన విరాళాలను పూర్తిగా ఖర్చు చేయలేదని వెల్లడించింది. సోదాల సందర్భంగా పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు లభించాయని పేర్కొంది.