పెద్దపల్లి, మార్చి 17(నమస్తే తెలంగాణ): కార్మికుల ఆరోగ్య పరిరక్షణపై సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇప్పించాలని నిర్ణయం తీసుకోగా, సింగరేణి వ్యాప్తంగా 45,118 మందికి కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నది. సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకోగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ సూచనల మేరకు అన్ని ఏరియాల్లోని ఏరియా దవాఖానలు, డిస్పెన్సరీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం సైతం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సెకండ్ ఫేస్ వ్యాక్సినేషన్లో భాగంగా సింగరేణిలో 45 ఏండ్ల వయస్సు పైబడిన దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలు వేయనున్నారు. కాగా, టీకా వేయించుకోవాలనుకునే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆధార్, కంపెనీ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తమ వెంట తీసుకొని ఆయా సింగరేణి ఏరియా దవాఖానలు, డిస్పెన్సరీలకు వెళ్తే టీకా వేస్తారని యాజమాన్యం పేర్కొంది. కాగా, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు పూర్తికాగా, ఆర్జీ-1, 2, 3 పరిధిలోని 13,594 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలుగనున్నది.