చెన్నై: తమిళనాడులోని చెన్నై-సేలం జాతీయ రహదారి మార్గంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారం ఆభరణాలను జప్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న సమయంలో భారీగా బంగారం రవాణా అవుతుండటం కలకలం కలిగించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్రమంతా అధికారులు విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సేలం-చెన్నై జాతీయ రహదారిపై పెరియార్ ప్రాంతంలో ఎన్నికల నిఘా దళాలు సోదాలు చేపట్టాయి.
ఈ క్రమంలో చెన్నై నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్ను ఆపి తనిఖీ చేశారు. అందులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ఉండటం గుర్తించారు. ఈ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నగలను చెన్నైలోని ఓ పేరున్న నగల దుకాణం నుంచి సేలం తీసుకెళ్తున్నామని, అక్కడ స్థానిక వ్యాపారులకు వీటిని సరఫరా చేయాలని సదరు వ్యక్తులు విచారణలో తెలిపారు. అయితే ఆభరణాలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకే ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారా? అన్న కోణంలో విచారిస్తామని తెలిపారు.
రూ.2 కోట్ల బంగారం సీజ్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల విభాగం అధికారులు రూ.2 కోట్ల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి శుక్రవారం రాత్రి వస్తున్న వాహనాన్ని గొరిమెడు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేకుండా బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శుబీర్ సింగ్ తెలిపారు. కరైకాల్ వద్ద రూ.50 లక్షల నగదు, రూ.17 లక్షల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నారు.