పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం తీర్మానించింది. సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించినందుకు కెప్టెన్ అమరిందర్ సింగ్కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరిందర్ సింగ్ గురువారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో చండీగఢ్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్, ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ మాకెన్ హాజరయ్యారు. తొలుత సీఎంగా పని చేసిన అమరిందర్ సింగ్కు ధన్యవాదాలు, సోనియాగాంధీకి తదుపరి సీఎం ఎంపిక బాధ్యత అప్పగిస్తూ పంజాబ్ సీఎల్పీ సమావేశం తీర్మానాలు ఆమోదించిందని హరీశ్ రావత్ మీడియాకు చెప్పారు.
అనూహ్య పరిణామాల్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో 78 మంది హాజరయ్యారని అజయ్ మాకెన్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పురోభివృద్ధికి కెప్టెన్ అమరిందర్ సింగ్ గైడెన్స్ లభిస్తుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే తదుపరి సీఎంగా నవ్జ్యోతి సిద్ధూ అభ్యర్థిత్వాన్ని అమరిందర్ సింగ్ వ్యతిరేకించారు. ఆ పదవికి అనర్హుడని వ్యాఖ్యానించారు. పంజాబ్ సీఎంగా సిద్ధూ బాధ్యతలు చేపడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.