న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిస్ధాయిలో సాగేలా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గురువారం పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరైనా వెనకాడితే వారికి నచ్చచెప్పాలని సూచించారు. థర్డ్ వేవ్ తలెత్తితే ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు సానుకూల చర్యలు చేపట్టాలని కోరారు. పలు రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
ఈ ఏడాది చివరికి దేశ జనాభాలో 75 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రభుత్వంపై పార్టీ శ్రేణులు ఒత్తిడి పెంచాలని సోనియా పిలుపు ఇచ్చారు. వ్యాక్సిన్ల సరఫరాపైనే సత్వర వ్యాక్సినేషన్ ఆధారపడినా కేంద్రంపై ఒత్తిడి పెంచడం కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో విముఖతను పోగొట్టడంతో పాటు వ్యాక్సిన్ వృధాను అరికట్టాలని సోనియా కాంగ్రెస్ శ్రేణులను కోరారు.