న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్పై సమైక్యంగా గళమెత్తిన తరహాలోనే విపక్షాలను కార్యోన్ముఖం చేసేలా విందు భేటీలను కొనసాగించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో మోదీ సర్కార్ను ఇరుకునపెట్టేలా వ్యవహరించేలా విపక్షాలను కోరుతూ రాహుల్ గాంధీ ఇటీవల విపక్ష నేతలకు బ్రేక్ఫాస్ట్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇదే ఒరవడిలో మోదీ సర్కార్ను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. విపక్ష నేతలకు త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా యూపీఏ సీఎంలను అందరినీ ఆహ్వానించాలని సోనియా యోచిస్తోందని తెలిసింది.