హైదరాబాద్ : మార్చి నెలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2,049 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. న్యాయస్థానం వీరిలో ముగ్గురికి తొమ్మిది రోజుల జైలు శిక్ష విధించగా.. 10 మందికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. మరో 45 మందికి ఐదు రోజులు, రెండు రోజుల పాటు జైలు శిక్ష పడగా.. 14 మంది కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండేవిధంగా శిక్షను పొందారు. వీరంతా కేవలం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డవారే. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ వింగ్స్ లెక్కలు వేరే.
పోలీసులు మొత్తం 1,917 మంది వ్యక్తులపై చార్జీషీటు దాఖలు చేశారు. మరో 132 చార్జీషీట్స్ దాఖలు చేయాల్సి ఉంది. జైలు శిక్షతో పాటుగా జరిమానాగా రూ.199 లక్షలను విధించారు. పట్టుబడ్డవారంతా గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. డ్రంక్ డ్రైవింగ్లో పట్టుబడ్డ వారంతా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో, పాస్పోర్టు, వీసా క్లియరెన్స్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.