కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరడాన్ని సమర్థిస్తున్నానని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందని ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికను ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాకను వ్యతిరేకించొద్దని సహచర సీనియర్ నేతలను మొయిలీ కోరారు.
‘ఎన్నికల రాజకీయ వ్యూహకర్తగా ఆయన రుజువు చేసుకున్నారు.. బయట నుంచి వ్యూహకర్తగా పని చేయడం కంటే పార్టీలోకి వస్తే మరింత ప్రయోజనంగా ఉంటుందని’ ఓ ప్రశ్నకు సమాధానంగా వీరప్ప మొయిలీ చెప్పారు. ఆయన వ్యూహం, ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయన్నారు.
ఇక ఎన్నికల వ్యూహకర్తగా తాను వ్యవహరించబోనని ఇటీవల ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. దీనికి తోడు పలుమార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నాయకులు రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరనున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం సోనియాగాంధీదేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.