97వ రాజ్యాంగ సవరణలో సొసైటీల భాగాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు
2:1 మెజారిటీతో తీర్పు వెల్లడి
న్యూఢిల్లీ: 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2:1 మెజారిటీ తీర్పులో సమర్థించినప్పటికీ దానిలో సహకార సంఘాలకు సంబంధించిన భాగాన్ని (పార్ట్ 9బీ) కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. జస్టిస్ జోసెఫ్ మాత్రం రాజ్యాంగ సవరణ మొత్తాన్ని విభేదించారని తీర్పును వెలువరించిన జస్టిస్ నారిమన్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ర్టాలకు పెద్ద విజయం. దేశంలోని కోఆపరేటివ్ సొసైటీల సమర్థ నిర్వహణకు సంబంధించిన అంశాలతో కూడిన 97వ రాజ్యాంగ సవరణను 2011 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. 2012 ఫిబ్రవరి 15నుంచి అమలులోకి వచ్చి ంది. అయితే ఈ సవరణను గుజరాత్ హైకోర్టు 2013లో కొట్టివేసింది. కోఆపరేటివ్ సొసైటీలు రాష్ర్టాల పరిధిలోని అంశమని, వాటికి చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఆ తీర్పు చెప్పింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో కేంద్రం సవాల్ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రొవిజన్ రాష్ర్టాల అధికారాలను హరిస్తుందా అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ వాదనల్లో భాగంగా కేంద్రం తమ అధికారాల పరిధిలోకి కేంద్రం చొరబడుతున్నదని పలు రాష్ర్టాలు తెలిపాయి. కోఆపరేటివ్ సొసైటీల నిర్వహణలో ఏకత్వాన్ని తీసుకొచ్చేందుకే రాజ్యాంగ సవరణను తీసుకొచ్చామని కేంద్రం తన వాదనను వినిపించింది. అలాంటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 252ను అనుసరించడం ఒక్కటే కేంద్రానికి ఉన్న మార్గమని సుప్రీంకోర్టు సూచిస్తూ ‘పార్ట్ 9బీ’ని కొట్టివేసింది. ఈ ఆర్టికల్ రెండు మూడు రాష్ర్టాల కోసం వాటి సమ్మతితో చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.