నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 23 : జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి శివారులో ఏర్పాటు చేసిన కొవిడ్ -19 కేంద్రాల్లో ఆదివారం 15 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్య సిబ్బంది తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 10 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 10 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా తేలినట్లు వైద్యాధికారి ఆయేషా సిద్దిఖీ తెలిపారు. పాన్గల్లీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా తేలిందని వైద్య సిబ్బంది తెలిపారు.
ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో ఐదుగురికి, చౌట్పల్లి పీహెచ్సీలో ఎనిమిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు తెలిపారు. మాక్లూర్, కల్లడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ నిర్ధారణ కాలేదని వైద్యులు సిఖిందర్నాయక్, సంజీవ్రెడ్డి తెలిపారు. మాక్లూర్లో 15 మందికి, కల్లడిలో 11 మందికి టెస్టులు నిర్వహించామని చెప్పారు. జ్వర సర్వేతో గ్రామాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మందికి కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారి అజయ్కుమార్ తెలిపారు. వరుసగా రెండు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కావడం లేదని ఆయన తెలిపారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడంతోనే కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రఘువీర్ తెలిపారు. ఇందల్వాయి పీహెచ్సీలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సుభాకర్ పేర్కొన్నారు.
మోపాల్ పీహెచ్సీలో 19 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ నవీన్ తెలిపారు. మోస్రాలో 15 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో ఆదివారం 11మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు.