న్యూఢిల్లీ, మే 30: తమ హయాంలో దేశం గర్వించదగ్గ ఎన్నో విజయాలు అందుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు. విజయాలతోపాటే అడ్డంకులు ఎదురయ్యాయని, కరోనా మహమ్మారి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. వైరస్పై దేశం తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆదివారం మోదీ మాట్లాడారు. ఈ ఏడేండ్లలోనూ సబ్కాసాత్, సబ్కావికాస్, సబ్కావిశ్వాస్ మంత్రాన్నే అనుసరించామని చెప్పారు. ఏ ఇతర దేశాల ఒత్తిళ్లకు లోనుకాకుండా దేశం సొంతంగా ముందుకు సాగుతున్నదని వివరించారు. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినవారికి దీటుగా బదులిచ్చామని చెప్పారు. ఎన్నో దీర్ఘకాలిక వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొన్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 7దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 3.5 కోట్ల కుటుంబాలకే నీటి వసతి కల్పించగా, గత 21 నెలల్లోనే 4.5 కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్ అందించామని వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం దేశానికి హానికరం: కాంగ్రెస్
కేంద్రంలోని మోదీ సర్కారు దేశానికి హానికరంగా తయారైందని కాంగ్రెస్ విమర్శించింది. కేంద్రం అన్ని విధాలుగా విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందని పేర్కొన్నది. ప్రభుత్వం వైఫల్యాలపై ఏడు పాయింట్లతో చార్జిషీట్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పతనం, కొవిడ్ కట్టడిలో వైఫల్యం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.
ఆత్మవిమర్శ చేసుకోవాలి: శివసేన
నెహ్రూ హయాం నుంచి గత ప్రభుత్వాలు చేసిన మంచిపనుల కారణంగానే నేడు ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతున్నదని శివసేన పేర్కొన్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చుతున్నామా అన్నదానిపై మోదీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్రౌత్ సూచించారు.
పదిరెట్లు పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తి
ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కరోనాపై భారత్ శాయశక్తులా పోరాడుతున్నదని చెప్పారు. మహమ్మారి సమయంలోనే దేశంపై పలు ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని,అయితే గతంలో కంటే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించినట్టు పేర్కొన్నారు. సెకండ్వేవ్ కారణంగా మెడికల్ ఆక్సిజన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. కొరతను అధిగమించేందుకు ఉత్పత్తిని పది రెట్లు పెంచామన్నారు.