న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ బారిన పడిన వారిలో 40 మందికి పైగా ఇండియన్ జర్నలిస్టులు ఉన్నారు. హిందూస్థాన్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శిశిర్ గుప్తాతోపాటు ఇండియా టుడే, నెట్వర్క్ 18, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ది వైర్ సంస్థల టాప్ జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయి.
అమిత్షా తనయుడు జయ్షా బిజినెస్ లావాదేవీలు, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త నిఖిల్ మర్చంట్, వ్యాపారవేత్త అజయ్ పిరమల్తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లావాదేవీలపై ఇంగ్లిష్ వెబ్సైట్ ది వైర్ పరిశోధనాత్మక కథనాలు రాసింది. రోహిణి సింగ్తోపాటు ఇద్దరు వైర్ వ్యవస్థాపక ఎడిటర్లు, ఇద్దరు కంట్రిబ్యూటర్ల కదలికలపై నిఘా పెట్టిందని సమాచారం.
ఇక వివాదస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం, ఇతర అంశాలపై పరిశోధనలు జరిపిన మాజీ ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు సుశాంత్ సింగ్పై 2018 మధ్యలో పెగాసస్ స్పైవేర్ ప్రయోగించారని తెలుస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనూ పెగాసస్ స్పైవేర్ బారిన పడిందని డిజిటల్ ఫోరెన్సిక్ అధ్యయనంలో తేలింది.
ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులపై ఈ స్పైవేర్ ఉపయోగించారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడటర్ శిశిర్ గుప్తా, ఎడిటోరియల్ పేజీ ఎడిటర్ ప్రశాంత్ షా, డిఫెన్స్ కరస్పాండెంట్ రాహుల్ సింగ్, రాజకీయ వార్తల జర్నలిస్టు ఔరంగజేబు నాస్బండీ, ఒక మింట్ విలేకరిపై స్పైవేర్ ప్రయోగించారని ఆ అధ్యయనం పేర్కొంది.
ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెందిన రితికా చోప్రా (ఎడ్యుకేషన్, ఎలక్షన్ కమిషన్), ముజామిల్ జలీల్ (కశ్మీర్ ప్రతినిధి), ఇండియా టుడే ప్రతినిధి సందీప్ ఉన్నిథన్, టీవీ 18 ఇన్వెస్టిగేషన్స్ అండ్ భద్రతా వ్యవహారాల ఎడిటర్ మనోజ్ గుప్తా, హిందూ జర్నలిస్టు విజేత సింగ్ల ఫోన్లను ట్రేస్ చేశారు.
ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్లు సిద్ధార్థ్ వరదరాజన్, ఎంకే వేణు ఫోన్లు కూడా పెగాసస్ బారిన పడ్డాయి. సంస్థ డిప్లమాటిక్ ఎడిటర్ దేవిరూప మిత్రా పేరు రికార్డుల్లో కనిపించింది. రాజకీయ, భద్రతా వ్యవహారాలపై పరిశోధనలు జరిపిన రోహిణి సింగ్, సీనియర్ కాలమిస్ట్ ప్రేమ్ శంకర్ ఝా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు స్వాతి చతుర్వేది కూడా పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డారు.
భారత్తోపాటు వివిధ దేశాల జర్నలిస్టులపై నిఘాకు పెగాసస్ స్పైవేర్ వినియోగంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ ఫార్బిడెన్ స్టోరీస్ సంయుక్తంగా స్వతంత్ర ఫోరెన్సిక్ అధ్యయనం జరిపాయి. ది వైర్తోపాటు 15 ఇతర వార్తా సంస్థల ప్రతినిధులపై పెగాసస్ నిఘా కొనసాగిందని ఈ పరిశీలనలో తేలింది.