న్యూఢిల్లీ: వచ్చే ఏడాది (2022) ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతున్నది. దీన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఈ మహోత్సవం సాగనున్నది. అయితే.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటో తెలుసుకుందాం..
ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజరామరం.. మహోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం.
దాదాపు రెండు వందల ఏండ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోద్యమం.. స్వాతంత్ర్యోద్యమం.. భరత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరెందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది.