రక్తస్రావం ఆగేందుకు .. ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం..
కార్మికనగర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..
వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని కార్మికనగర్లో నివాసముంటున్న టైలర్ సిద్ధిఖ్ అహ్మద్(36) గత నెల 31న తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడి భార్య రుబీనాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సయ్యద్ మహ్మద్ అలీ ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిద్ధిఖ్ అహ్మద్ను అడ్డు తొలగించాలనుకుంటున్న విషయాన్ని అనేకసార్లు రుబీనాకు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీనికి రుబీనా కూడా అంగీకారం తెలిపినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే గత నెల 30న పిల్లలను తీసుకుని రుబీనా పుట్టింటికి వెళ్లిందని, ఆ రాత్రి అక్కడ భోజనం చేసి ఒంటరిగా ఇంటికి వెళ్లిన విషయాన్ని ఆమె తన ప్రియుడు సయ్యద్ అలీకి తెలిపినట్లు తేలింది. దీంతో కార్మికనగర్లో సిద్ధిఖ్ అహ్మద్ అపార్ట్మెంట్ వద్ద కాపుకాసిన అలీ..అతడు లోనికి వెళ్లిన కొంతసేపటికి అపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య చేసేందుకు ప్రణాళికతో వచ్చిన అలీ.. సిద్ధిఖ్ లోనికి వెళ్లిన తర్వాత తలుపుతట్టాడు. అయితే లోనికి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే సిద్ధిఖ్ నిద్రపోయాడు. ఎంతసేపటికీ అతడు డోర్ తీయకపోవడంతో ఇంటికి వెళ్లిన అలీ సుమారు రెండు గంటల తర్వాత తిరిగివచ్చాడు. తనతో పాటు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ వంటి వస్తువుతో కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి వెళ్లిన అలీ.. నిద్రపోతున్న సిద్ధిఖ్ తలపై బలంగా కొట్టి చంపేశాడు. దీంతో తలకు తీవ్ర రక్తస్రావం అయి సిద్ధిఖ్ మృతి చెందాడు. అయితే తలకు విపరీతంగా రక్తం కారుతుండటంతో వంటింట్లో ఉన్న ఫ్రిజ్ వద్దకు మృతదేహాన్ని లాక్కొచ్చిన అలీ.. అందులో తల భాగాన్ని పెడితే రక్తం కారడం ఆగిపోతుందని భావించి ప్రయత్నాలు చేశాడు. అయితే ఫ్రిజ్లో మృతదేహం పట్టకపోవడంతో సుమారు రెండుగంటల పాటు వివిధ ప్రయత్నాలు చేసిన అలీ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
హత్య అనంతరం రుబీనాకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. కాగా, భర్త హత్యకు గురైనట్లు తెలిసినా రెండురోజుల పాటు ఎవరికీ చెప్పకపోగా పోలీసులు ప్రశ్నించినప్పుడు కేసును పక్కదోవ పట్టించేందుకు రుబీనా ప్రయత్నించింది. సిద్ధిఖ్ కుటుంబసభ్యులతో ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లు, వాటి కారణంగానే గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి ఉండవచ్చంటూ పోలీసులను పక్కదారి పట్టించేందుకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో నిందితుడు అలీతో పాటు రుబీనాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.