భువనేశ్వర్ : కక్ష సాధింపు చర్య అంటే ఇదేనేమో! తనను కాటేసిన పామును వదిలిపెట్టకుండా.. దాన్ని వెతికి పట్టుకుని నోటితో కొరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గంభారిపటియా గ్రామానికి చెందిన కిశోర్ భద్ర(45) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతని కాలుకు విషసర్పం రక్తపింజర కాటేసింది. పాము కాటేసిందన్న విషయాన్ని గ్రహించిన భద్ర.. తన టార్చ్ సహాయంతో అక్కడే ఉన్న పామును పట్టుకున్నాడు. తననే కాటేస్తావా అంటూ.. ఆ పామును నోటితో కొరికి చంపాడు.
ఆ పామును పంట పొలాల్లోనే వదిలేయకుండా తన ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని తన భార్యకు చూపించి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియగా భద్ర ఇంటికి తరలివచ్చారు. ఆస్పత్రికి వెళ్లాలని భద్రకు స్థానికులు సూచించారు. కానీ అతను ఆస్పత్రికి వెళ్లకుండా పాముకాటుకు మందు ఇచ్చే వ్యక్తి వద్దకు వెళ్లాడు. అతను ఇచ్చిన నాటు వైద్యంతో తాను బాగానే ఉన్నానని, తనకెలాంటి సమస్య లేదని భద్ర పేర్కొన్నాడు.