న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ జ్జ్ఞాని బాబాలా విజ్జ్ఞాన సుమాలను ఇతరులపై వెదజల్లుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కరోనా సెకండ్ వేవ్ తొలుత వ్యాప్తి చెందిందని, తమ పార్టీ ప్రభుత్వాలు మహమ్మారిని ఎందుకు కట్టడి చేయలేదో రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ఓ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కరోనా మరణాల రేటు అత్యధికంగా ఉందని ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అన్ని విభాగాల్లో విఫలమయ్యాయని ఆరోపించారు. కరోనా పాజిటివిటీ రేటు సైతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా ఉందని ఆమె చురకలు వేశారు.కాగా ప్రధాని కన్నీళ్లతో ప్రజల ప్రాణాలు కాపాడలేమని, ఆక్సిజన్తోనే ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతామని రాహుల్ వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా గత కొంతకాలంగా రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.