స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
పలు గ్రామాల్లో పర్యటన.. పనుల పరిశీలన
పెద్దపల్లి రూరల్, జూన్17: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పనులు చేయిస్తున్నదని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనలో భాగంగా పెద్దపల్లి మం డలం బొంపల్లి, కాసులపల్లి, పాలితం మీదుగా ధర్మారం మండలం నుంచి జగిత్యాల జిల్లాకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఆయా గ్రామాలను సందర్శించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీవో సుదర్శన్, సర్పంచులు అరికిల్ల లక్ష్మయ్య, దాసరి పద్మ, అప్పన్నపేట సింగిల్విండో చైర్మన్ దాసరి చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, మంగ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం, జూన్17: గ్రామాలు సంపూర్ణ పారిశుధ్య పనులతో కళకళలాడాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. దొంగతుర్తి, ఖిలావనపర్తి, నంది మేడారం, ధర్మారంలో పారిశుధ్య కార్యక్రమాల పనితీరు పరిశీలించేందుకు ఆయన గురువారం వచ్చారు. నంది మేడారంలో రోడ్డు పక్కన ధ్వంసమైన మొక్క స్థానంలో మరొకటి అదనపు కలెక్టర్ నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏపీవో నాడెం రవి, సర్పంచులు పాలకుర్తి సత్తయ్య, సాగంటి తార, సామంతుల జానకి, ఎంపీటీసీ సభ్యులు, జీపీ కార్యదర్శులు మహేందర్, అంబటి శంకర్, లక్ష్మణ్బాబు తదితరులు పాల్గొన్నారు.