న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు.
కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని
ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమిన్స్, బ్రెట్ లీ, సచిన్, శిఖర్ ధావన్, జయదేవ్ ఉనద్కత్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానె 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మిషన్ వాయు అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడు.
రహానె చేసిన సాయానికి మహారత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మహారాష్ట్రలోని అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాలకు వీటిని పంపుతామని ప్రకటించింది. ‘మిషన్ వాయుకు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందించిన రహానెకు ధన్యవాదాలు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న జిల్లాలకు వీటిని అందజేస్తామని’ MCCIA ట్వీట్ చేసింది. కరోనా సెకండ్ వేవ్తో దేశంలో ప్రతిరోజూ 4లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది.