న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నవి అసాధారణ పరిస్థితులని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు సాయం చేసినా స్వాగతిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా గురువారం చెప్పారు. ఇప్పటి వరకూ సుమారు 40 దేశాలు ఇండియాకు సాయం చేయడానికి ముందుకు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ దేశాల్లో చాలా వరకు గతంలో తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఇండియా సాయం అందుకున్నాయని, ఇప్పుడు దానికి రుణం తీర్చుకుంటున్నాయని హర్షవర్దన్ అన్నారు.
ప్రస్తుతం దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో కొరత ఉన్న ఆక్సిజన్, మందులు వంటి వాటిని వివిధ దేశాల నుంచి తీసుకొస్తున్నాము. చాలా దేశాలు వాటికవే సాయం చేయడానికి ముందుకు వచ్చాయి అని ఆయన చెప్పారు. అంతేకాదు వచ్చే మూడు రోజుల్లో అమెరికా నుంచి మూడు ప్రత్యేక విమానాలు ఇండియాకు రానున్నాయని తెలిపారు. ఇక యూఏఈ నుంచి కార్గో విమానంలో వెంటిలేటర్లు, ఫావిపిరవిర్ మందులు వస్తున్నట్లు హర్షవర్దన్ చెప్పారు.
ఐర్లాండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రాన్స్ నుంచి మరో విమానం వస్తున్నాయి. మొత్తం ఇలా 40 దేశాలు.. అందులో అభివృద్ధి చెందినవే కావు. మన పొరుగు దేశాలైన మారిషస్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొరత గురించి స్పందిస్తూ.. సాధారణంగా ఇండియాలో రోజుకు 67 వేల ఇంజక్షన్లు తయారవుతాయని, కానీ ప్రస్తుతం 2, 3 లక్షలు అవసరమవుతున్నాయని చెప్పారు. దీంతో రోజుకు 4 లక్షల ఇంజక్షన్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
యూకే నుంచి 3 ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లు
ఇక యునైటెడ్ కింగ్డమ్ దేశానికి మూడు ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లను పంపిస్తోంది. ఉత్తర ఐర్లాండ్లో అధికంగా ఉన్న వీటిని ఇండియాకు పంపిస్తుండటం విశేషం. ఈ ఒక్కో యూనిట్ నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలదు. అంటే 50 మంది పేషెంట్లు ఒకేసారి ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను ఇవి తీర్చగలవు.
ఈ మినీ ఫ్యాక్టరీలో ఒక్కొక్కటి షిప్పింగ్ కంటైనర్ల సైజులో ఉంటాయి. ఇండియాలో పరిస్థితులు తమను కలచివేస్తున్నాయని యూకే ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ అన్నారు. యూకే నుంచి ఈ ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లే కాకుండా మరో 495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 200 వెంటిలేటర్లు కూడా వస్తున్నాయి.