రవీంద్రభారతి, జూలై 7: నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగే సురభి నాటకోత్సవ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేసి పేద కళాకారులను ఆదుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటికే 550 మంది కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చామని.. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి మరికొంతమంది కళాకారులను ఆదుకుంటామన్నారు.వివిధ జిల్లాల్లోని కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తామన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక శాఖకు మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ఉండటం మనందరి అదృష్టమన్నారు. కళల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. అనం తరం కళాకారులు మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ సెక్రటరీ వసుంధర పాల్గొన్నారు.