న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో మృతిచెందారు. రెండువారాల కిందట కొవిడ్-19 బారినపడిన ఆశిష్.. గుర్గావ్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ‘కొవిడ్తో పోరాడుతూ ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకును కోల్పోయానని తెలియజేయడం చాలా బాధగా ఉన్నది. మాకు ధైర్యం చెప్పి, కుమారుడికి వైద్యం అందించి మా వెంట నిలిచిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులందరికీ ధన్యవాదాలు’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో చదివిన ఆశిష్.. ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర వార్తాసంస్థల్లో పనిచేశారు. ఆశిష్ మృతికి సీపీఎం పొలిట్బ్యూరో సంతాపం ప్రకటించింది. ఆశిష్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సంతాపం తెలిపారు.
ఏచూరికి మంత్రి కేటీఆర్ పరామర్శ
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు అశిశ్ మృతిపట్ల పురపాలన, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి పరిస్ధితుల్లోనే ధైర్యంగా ఉండాలని కోరారు.
ఇవీ కూడా చదవండి…