హైదరాబాద్ : ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్రోడ్ నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన వివిధ స్థలాలను పీవీ శత జయంతి వేడుకల కమిటీ గురువారం పరిశీలించింది. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె.కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ వాణి దేవీ, చంద్రశేఖర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ విగ్రహావిష్కరణకు స్థలాలను పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు పీవీ శత జయంతి ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.