న్యూఢిల్లీ : వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సిస్టం (ఈవిన్) డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ నిల్వలపై సమాచారం పంచుకోవద్దని కేంద్రం కోరడం పట్ల ఆప్ నేత విస్మయం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ నిల్వల సమాచారం దాచడం బదులు అందరికీ తగినంతగా వ్యాక్సిన్ సరఫరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సిసోడియా ట్వీట్ చేశారు. కాగా, ఈవిన్ డేటా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని కేంద్రం వివరణ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతితోనే ఈవిన్ డేటాను పంచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.