కరీంనగర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): దేశంలో ఎఫ్సీఐ సేకరించే ధాన్యంలో 56 శాతం తెలంగాణదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 14 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ కొనుగోలు చేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడం, నిరంతర ఉచిత విద్యుత్తును ఇవ్వడం, రైతుబంధు కింద పెట్టుబడి సహాయం చేయడంతో సాగుపై రైతుల్లో భరోసా పెరిగిందన్నారు. గతేడాది యాసంగిలో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే కోటి టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు కోటి 32 లక్షల టన్నుల ధా న్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పా రు. పది, పదిహేను రాష్ర్టాల్లో వచ్చే దిగుబడి ఒక్క తెలంగాణలోనే వస్తున్నదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎఫ్సీఐ ససేమిరా అన్నప్పటికీ సీఎం కేసీఆర్ పదేపదే తెచ్చిన ఒత్తిడి కారణంగా కొనుగోళ్లకు సిద్ధమైందని తెలిపారు. రాష్ట్రంలో 6,400 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందుకు అవసరమైన రూ.16 వేల కోట్లను సిద్ధంగా ఉంచినట్టు మంత్రి గంగుల వెల్లడించారు. ఏ రాష్ట్రంలో కూడా రైతులకు కనీస మద్దతు ధర లభించ డం లేదని, కానీ తెలంగాణలో మాత్రం ధాన్యం ఏ-గ్రేడు క్వింటాల్కు రూ. 1,888లు అందేలా చూస్తున్నామన్నారు. కొనుగోళ్లకు 21 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ఇప్పుడు రాష్ట్రంలో 9.30 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని, మిగతా వి దేశంలో ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. నల్లగొండ, మిర్యాలగూడ, నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే 685 కేంద్రాలను ప్రారంభించి 20 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు.