న్యూఢిల్లీ, మే 24: ఫంగల్ ఇన్ఫెక్షన్లను రంగులతో కాకుండా వాటి పేర్లతోటే పిలువాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. ఒకే ఫంగస్కు వేర్వేరు రంగుల పేర్లను ఆపాదించడం వల్ల ఆయోమయం తలెత్తే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఆక్సిజన్ థెరపీకి మ్యుకర్మైకోసిస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆక్సిజన్ థెరపీ తీసుకుకోండా ఇంటి వద్దనే చికిత్స పొందిన వారికీ మ్యుకర్మైకోసిస్ సోకిందని చెప్పారు. మ్యుకర్మైకోసిస్ను బ్లాక్ ఫంగస్గా పిలువొద్దని, అది సాంక్రమిక వ్యాధి కాదని చెప్పారు. దీని బారిన పడిన వారిలో దాదాపు 90-95 శాతం మంది డయాబెటిక్ బాధితులు లేదా స్టెరాయిడ్స్ తీసుకున్నవారేనని వివరించారు. మిగతావారికి ఇది సోకడం అరుదని అని చెప్పారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మ్యుకర్మైకోసిస్, కెండిడా, యాస్పర్జిలోసిస్ ఎక్కువగా సోకుతుంటాయని వివరించారు. యాంటీ ఫంగల్ చికిత్స వారాల తరబడి అందించాల్సి ఉంటుందని, ఇది దవాఖానలకు సవాలేనని పేర్కొన్నారు.
థర్డ్వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని గులేరియా స్పష్టంచేశారు. మొదటి, రెండో వేవ్ను పరిశీలిస్తే కరోనా బారిన పడిన పిల్లలు తక్కువేనని, ఒక వేళ సోకినా వారిలో వైరస్ తీవ్రత తక్కువేనని గుర్తుచేశారు.