న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలతో ఢిల్లీ నగరంలో పోస్టర్లు వేసిన వారిపట్ల అక్కడి పోలీసులు సీరియస్గా ఉన్నారు. గత రెండు రోజుల నుంచి నిందితులపై 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని నాలుగు విభాగాలకు (ఈస్టర్న్ రేంజ్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్) చెందిన పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను గుర్తించారు.
నగరం మొత్తంలో మోదీ వ్యతిరేక నినాదాలతో ఉన్న 800కు పైగా పోస్టర్లు, బ్యానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఢిల్లీలోని కొందరు యువకులు ప్రధానిపై విమర్శలు చేశారు. ఆ మేరకు విమర్శలను పోస్టర్లుగా వేసి గోడలకు అంటించారు. దేశ ప్రజలను వదిలేసి మోదీ విదేశాలకు వ్యాక్సిన్లు అమ్ముకున్నాడని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.