న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను బాసటగా నిలిచానని..ఇదే స్ఫూర్తితో మీరూ మాకు అండగా నిలవాలని లేఖలో ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు. కొవిడ్-19తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈ పధకానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు కోరినా వాటిని చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ పధకాన్ని నిలిపివేయరాదని ఢిల్లీలోని 70 లక్షల పేదల తరపున తాను చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఆప్ ప్రభుత్వం ప్రారంభించనున్న విప్లవాత్మక రేషన్ డెలివరీ స్కీమ్ ను కేంద్రం నిలిపివేసిందని అంతకుముందు కేజ్రీవాల్ మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రేషన్ డెలివరీ పధకం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా కేంద్రం మోకాలడ్డిందని ఆరోపించారు. ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే కార్యక్రమం అమలైతే రేషన్ మాఫియాకు తెరపడుతుందని చెప్పారు.